
హైదరాబాద్ | వారధి న్యూస్ | పాలాది నాగరాజు
హైదరాబాద్: దక్షిణ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నంగా భావిస్తున్న దోర్నకల్–గద్వాల కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుపై మరో కీలక ముందడుగు పడింది. నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సతీష్ కుమార్ను కలిసి ప్రతిపాదిత రైల్వే మార్గానికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) ను సమర్పించారు.
ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే దక్షిణ తెలంగాణలో రైల్వే సౌకర్యం తక్కువగా ఉన్న అనేక ప్రాంతాలకు మెరుగైన రవాణా వసతులు అందుబాటులోకి వస్తాయని ఎంపీ పేర్కొన్నారు.
296 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్
ప్రతిపాదిత దోర్నకల్–గద్వాల రైల్వే లైన్ సుమారు 296 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.5,330 కోట్ల అంచనా వ్యయంగా పేర్కొన్నారు.
ఈ మార్గం మహబూబాబాద్ జిల్లాలోని దోర్నకల్ నుంచి ప్రారంభమై.. సూర్యాపేట, నల్గొండ, దేవరకొండ, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల వరకు వెళ్లేలా ప్రతిపాదించారు.
గతంలోనూ పార్లమెంట్లో ప్రస్తావన
ఈ రైల్వే లైన్ కోసం గతంలో పలువురు ఎంపీలు పార్లమెంట్ వేదికగా తమ డిమాండ్ను వినిపించారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, పాలమూరు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు రైల్వే అధికారులను కలిసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ వచ్చారు.
దోర్నకల్–గద్వాల్ రైల్వే లైన్కు ముందడుగు.. మాజీ ఎంపీ రాములు ప్రయత్నాలకు కొనసాగింపు
ఇదిలా ఉండగా, గతంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో మాట్లాడుతూ ప్రతిపాదిత దోర్నకల్–గద్వాల రైల్వే మార్గానికి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) పూర్తయినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజాగా ఎంపీ మల్లు రవి డీపీఆర్ను సమర్పించడంతో ప్రాజెక్టు తదుపరి దశలపై ఆశలు పెరిగాయి.
బెంగళూరు ప్రయాణానికి మరింత సౌకర్యం
ఈ రైల్వే మార్గం నిర్మాణం పూర్తయితే ఉమ్మడి వరంగల్, నల్గొండతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి బెంగళూరు తదితర నగరాలకు రైలు ప్రయాణం మరింత సులభమయ్యే అవకాశం ఉంది. ప్రయాణ సమయం, దూరం తగ్గడంతో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.
వ్యవసాయం, వ్యాపారానికి ఊతం
రైల్వే సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు కొత్త రైలు మార్గం రావడం వల్ల స్థానికంగా వ్యవసాయం, వ్యాపారం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. సరుకు రవాణా సులభతరం కావడం ద్వారా రైతులు, వ్యాపారులకు కూడా ప్రయోజనం కలగవచ్చని స్థానికులు ఆశిస్తున్నారు.
నిధుల కేటాయింపుపై ఎదురుచూపులు
దోర్నకల్–గద్వాల రైల్వే లైన్కు త్వరితగతిన ఆమోదం ఇవ్వడంతో పాటు అవసరమైన నిధులు కేటాయించాలని ఎంపీ మల్లు రవి రైల్వే బోర్డును కోరారు. ఇప్పటికే సర్వే పూర్తయిన నేపథ్యంలో డీపీఆర్ సమర్పణ తర్వాత ప్రాజెక్టు ఎలాంటి దశకు చేరుకుంటుందో, కేంద్రం నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాల్సి ఉంది.











