ఇకనైనా మాట నిలబెట్టుకోవాలి.. లేదంటే ప్రజా ఆగ్రహం తప్పదు : బొంగు వెంకటేష్ గౌడ్ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఉద్యమకారుల సమస్యలను పరిష్కరిస్తామని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించినప్పటికీ, దాదాపు మూడేళ్లు గడిచినా వాటికి కార్యరూపం దాల్చలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులను పట్టించుకోకపోవడం వల్లే ఆ పార్టీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే వైఖరిని కొనసాగించరాదని సూచించారు. కేకే కమిటీ ద్వారా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఉద్యమకారులు ఆశగా ఎదురుచూస్తున్నారని, ఇకనైనా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ప్రత్యేక గుర్తింపు కార్డులు, స్వాతంత్ర్య సమరయోధుల తరహాలో నెలకు రూ.25 వేల పింఛన్, రూ.10 వేల కోట్లతో సంక్షేమ బోర్డు, బస్సు, రైలు ప్రయాణాల్లో ఉచిత సదుపాయం, నెలకు రూ.25 వేల గౌరవ వేతనం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం, ఉద్యమ సమయంలో నమోదైన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. గత పదేళ్లుగా ప్రభుత్వాల నుంచి న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురుచూస్తున్న వారి కుటుంబాలను ఇకనైనా ఆదుకోవాలని, నిజమైన ఉద్యమకారులను గుర్తించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు అర్హులైన కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమస్యలను ఇంకా నిర్లక్ష్యం చేస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు ఉద్యమకారుల సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కారింగుల నరేందర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జోర్క రాము ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క జంగయ్య గౌడ్, జిల్లా ప్రచార కార్యదర్శి గోగిఖర్ కిషోర్ లాల్తో పాటు పలువురు పాల్గొన్నారు.








