
పండుగల సీజన్లో ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్లో సరికొత్త రికార్డు నమోదైంది. సెప్టెంబరు 7న ఒక్కరోజే 20,06,353 టికెట్లు బుక్ అయ్యాయి. గతేడాది ఆగస్టు 19న నమోదైన 18,40,203 టికెట్ల రికార్డును అధిగమించింది. సెప్టెంబరు 8న కూడా 19,50,699 టికెట్లు బుక్ కావడం విశేషం. ప్రస్తుతం రిజర్వేషన్ టికెట్లలో సుమారు 89 శాతం ఆన్లైన్లోనే బుక్ అవుతున్నాయి. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఐఆర్సీటీసీ బుకింగ్ వ్యవస్థను బలోపేతం చేసింది. కొత్త సర్వర్లను ఏర్పాటు చేసి సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసింది. సాఫ్ట్వేర్ మార్పులతో వేగాన్ని పెంచడంతోపాటు కొత్త యూజర్ ఇంటర్ఫేస్ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో స్లీపర్, ఏసీ త్రీ టైర్, ఏసీ టూ టైర్ తరగతుల లభ్యతను ఒకే తెరపై చూసుకునే అవకాశం కల్పించింది.
అనధికార బాట్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు యాంటీబాట్, సీడీఎన్ సాంకేతికతలను అమలు చేసింది. ఫలితంగా హానికరమైన బాట్ ట్రాఫిక్ 55 నుంచి 65 శాతం వరకు తగ్గింది. ప్రారంభ రిజర్వేషన్ సమయంలో ఆధార్ ధ్రువీకరించిన వినియోగదారులకే బుకింగ్ అవకాశం కల్పిస్తున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా 3.04 కోట్ల యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసి, 6.33 కోట్ల ఐడీలను పునఃధ్రువీకరణకు పంపారు. 16,041 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్లను నిలిపివేశారు. భారీ రద్దీ, లక్షలాది ఏకకాల బుకింగ్లను సమర్థంగా నిర్వహిస్తూ ఎలాంటి అంతరాయానికీ తావులేకుండా సేవలు కొనసాగించడంతో ఐఆర్సీటీసీ డిజిటల్ బుకింగ్ వ్యవస్థ సామర్థ్యానికి ఈ రికార్డు నిదర్శనంగా నిలిచింది.













